సౌతాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా.. అఫ్గానిస్థాన్తో ఐదు టీ20ల సిరీస్కు సిద్దమవుతోంది. ఈ సిరీస్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. గత 14 నెలలుగా పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ.. టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్తో సెమీఫైనల్లో చివరిసారిగా ఆడారు.
ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024కు ముందు భారత్ ఆడుతున్న ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగనుండగా.. విరాట్ కోహ్లీ ఆడే స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. వన్డేల మాదిరి విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్లో ఆడుతాడా? లేక ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడినట్లు ఓపెనర్గా ఆడుతాడా? అనేది చర్చనీయాంశమైంది.

వన్డే తరహా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ.. టీ20ల్లో రాణించాలంటే దూకుడుగా ఆడాలని, ముఖ్యంగా ప్రపంచకప్కు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్, అమెరికాలో పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డేల మాదిరి టీ20ల్లో యాంకర్ రోల్ పోషిస్తానంటే కుదరదని, ప్రతీ బ్యాటర్ దూకుడుగా ఆడాల్సిందేనని సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో ఆడించడం కంటే ఓపెనర్గా ఆడించడం ఉత్తమమని సూచిస్తున్నారు. టీ20 ఫార్మాట్లో యాంకర్ రోల్ పోషించాల్సిన అవసరం లేదని, మిడిలార్డర్, లోయరార్డర్లో సత్తా చాటే ఆటగాళ్లున్నారని చెబుతున్నారు. కోహ్లీ గైర్హాజరీలతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన కనబర్చారు. కాబట్టి మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదు.
అంతేకాకుండా ఓపెనర్గా విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. ఆర్సీబీ తరఫున కూడా అతను ఓపెనర్గానే ఆడుతున్నాడు. మూడో స్థానంలో 135 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఓపెనర్గా 161.29 స్ట్రైక్రేట్తో రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అఫ్గానిస్థాన్తో ఆసియాకప్ 2022లో చివరిసారిగా ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లోనే టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేశాడు.
2021లో ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ కోహ్లీ 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక స్పిన్ బౌలింగ్ ఆడటంలోనూ విరాట్ కోహ్లీ తడబడుతాడు. ఈ క్రమంలోనే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ దిగితే మిడిల్ ఓవర్లలో స్పిన్ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతాడు. టీ20ల్లో బాల్స్ను డాట్ చేయడం నేరం. ఈ క్రమంలోనే ఓపెనర్గా బరిలోకి దిగితే ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ మధ్య పేస్ బౌలింగ్ను ఆడే వెసులు బాటు కోహ్లీకి దక్కుతుంది. అంతేకాకుండా రోహిత్ ధాటిగా ఆడితే కోహ్లీ.. అతనికి సహకారంగా బ్యాటింగ్ చేయవచ్చు.