వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం అనంతరం విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సౌతాఫ్రికా పర్యటనకు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్లు ఆడనని ఇప్పటికే విరాట్ కోహ్లీ.. బీసీసీఐకి సమాచారాం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న విరాట్ కోహ్లీ.. ఫ్యామిలీతో కలిసి ఈ ఖాళీ సమయాన్ని లండన్లో ఆస్వాదిస్తున్నాడు. డిసెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ ఆడనని బీసీసీఐకి కోహ్లీ సమాచారమిచ్చాడని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపాడు.

'వైట్ బాల్ క్రికెట్ నుంచి తనకు తగినంత విశ్రాంతి కావాలని సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కోహ్లీ తెలియజేశాడు. వైట్ బాల్ క్రికెట్లో మళ్లీ ఎప్పుడూ రీఎంట్రీ ఇస్తాననే విషయం కూడా చెప్పాడు. ప్రస్తుతం తనకు రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడాలని ఉందని తెలియజేశాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ అయితే కోహ్లీ ఆడనున్నాడు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. మరో 2-3 రోజుల్లో జట్లను ప్రకటించే అవకాశం ఉంది. వైట్బాల్ క్రికెట్కు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో కుర్రాళ్లకు బీసీసీఐ అవకాశం ఇవ్వనుంది. రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంపై స్పష్టత లేదు.
రోహిత్ శర్మ సైతం లండన్లోనే కులుంబ సభ్యులతో ఈ విశ్రాంతి సమయాన్ని గడుపుతున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలతో తీరిక లేకుండా ఆడిన టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది.
వన్డే ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ 765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఫైనల్ ఓటమితో తీవ్ర నిరాశకు గురైన అతను.. ఆ బాధ నుంచి బయటపడేందుకే లండన్ వెళ్లాడు. కొంత కాలం వైట్బాల్ క్రికెట్ ఆడకుండా రెడ్ బాల్ క్రికెట్పై ఫోకస్ పెట్టాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు అతని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ల కోసం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 8 వరకు ఈ పర్యటన సాగనుంది.