న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా తమ సన్నాహకాలను ముమ్మరం చేసింది. మంగళవారం వరకు నెట్స్కు పరిమితమైన టీమిండియా.. బుధవారం నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు రెండుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లంతా ఒక టీమ్ కాగా.. బౌలర్లంతా మరో టీమ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు.
బుధవారం ప్రారంభమైన ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మంచి టచ్లో కనిపించిన ఈ ఇద్దరూ తొలి సెషన్ మొత్తం ఆడారు. వికెట్ ఇవ్వకుండా హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. చివరకు ఇతరులకు బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలనే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు.

అనంతరం విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ బ్యాటింగ్కు వచ్చారు. గిల్ ఆచితూచి ఆడినా కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తన బలహీనతకు మరోసారి బలయ్యాడు. ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీకి వికెట్ ఇచ్చుకున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్లో బౌలింగ్లో కోహ్లీ ఔటయ్యాడు. ఐదో స్టంప్ డెలివరీని వెంటాడి స్లిప్ క్యాచ్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కోహ్లీ ఔట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఉనాద్కత్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా లాంగ్ స్పెల్స్ వేయగా.. సిరాజ్, ఉనాద్కత్లు పేస్ బాధ్యతలను పంచుకున్నారు. ఈ నెల 12 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో రహానే బ్యాటింగ్ చేయనున్నారు. వన్డే, టీ20ల్లో సత్తా చాటిన కోహ్లీ.. టెస్ట్ల్లో మాత్రం మునపటిలా రాణించలేకపోతున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో సెంచరీ బాదిన కోహ్లీ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా విఫలమయ్యాడు. 0కనీసం వెస్టిండీస్ పర్యటనలోనైనా సత్తా చాటాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.