ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఘనంగా ప్రారంభించాడు. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న అనధికారిక టెస్ట్లో భారత్-ఏ తరఫున కరుణ్ నాయర్ సెంచరీతో సత్తా చాటాడు. శుక్రవారమే ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ లయన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. భారత్-ఏ జట్టు బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(8)తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(24) నిరాశపర్చగా.. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
85 బంతుల్లో సెంచరీ..
తనదైన బ్యాటింగ్తో కరుణ్ నాయర్ అలరించాడు. 85 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ 155 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 205 బంతుల్లో 150 పరుగులు సాధించి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కరుణ్ నాయర్కు ఇది 24వ ఫస్ట్ క్లాస్ సెంచరీ కావడం విశేషం. అతనికి సర్ఫరాజ్ ఖాన్ అండగా నిలిచాడు. 84 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 119 బంతుల్లో 13 ఫోర్లతో 92 పరుగులు చేసి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 181 పరుగులు జోడించారు. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్(41 బ్యాటింగ్)తో కలిసి కరుణ్ నాయర్(154 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.

8 ఏళ్ల తర్వాత..
దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ప్రదర్శనతో 8 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్ట్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు భారత్-ఏ జట్టు తరఫున కరుణ్ నాయర్ అనధికారిక టెస్ట్లు ఆడుతున్నాడు.
తొలి మ్యాచ్లోనే సెంచరీ బాది సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కరుణ్ నాయర్ నిలబెట్టుకున్నాడు. ఈ ప్రదర్శనతో భారత తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. డియర్ క్రికెట్ ఒక్క ఛాన్స్ ఇవ్వు ట్వీట్ చేసిన కరుణ్ నాయర్.. ఆ అవకాశాన్ని అందుకునేందుకు చేరువయ్యాడు. కరుణ్ నాయర్ సెంచరీతో భారత్-ఏ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 77 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లకు 339 పరుగులు చేసింది.