ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం తెల్వనోడికి పెత్తనం ఇస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీని ఉద్దేశించి విమర్శలు గుప్పించాడు. పాక్ సీనియర్ ఆటగాళ్లైన బాబర్ ఆజామ్, షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా.. వారిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.
కొలంబో వేదికగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ 61 పరుగుల తేడాతో మట్టికరిపించిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో టీమిండియా సూపర్-8 బెర్త్ దక్కించుకోవడంతో పాటు పాకిస్థాన్పై తమ ఆధిపత్యాన్ని 8-1గా మార్చుకుంది.

పాక్ పరాజయంపై ఓ న్యూస్ ఛానెల్తో మాట్లాడిన షోయబ్ అక్తర్.. జట్టు ప్రదర్శనపై ఘాటు విమర్శలు చేశాడు. 'మోహ్సిన్ నఖ్వీకి తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అన్న సంగతి గుర్తుందా? ఏం తెలియని వ్యక్తికి పీసీబీ పగ్గాలు ఇచ్చారు. ఇలా ఉంటే జట్టు ఎలా ముందుకు నడుస్తుంది? మీరు ఒక వ్యక్తిని సూపర్ స్టార్ అన్నారు. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదు.
ఇలాంటి స్టార్లను తయారు చేసి ఎంచుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయి. ప్రపంచంలో అతిపెద్ద నేరం ఏంటంటే అసమర్థుడిని తీసుకొచ్చి అందలం ఎక్కించడం. సామర్థ్యం లేని వ్యక్తిని ఉన్నత స్థానంలో కూర్చోబెడితే అతను దేశాన్ని నాశనం చేస్తాడు. సొంత వ్యవస్థనే కూలదోస్తాడు. అందుకు ఉదాహరణ మోహ్సిన్ నఖ్వీనే.'అని అక్తర్ మండిపడ్డాడు.
ఈ ఓటమితో పాకిస్థాన్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నమీబియాతో జరిగే ఆఖరి మ్యాచ్లో విజయం సాధిస్తే ఆ జట్టు సూపర్-8 చేరుతుంది. ఓడితే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
పాకిస్థాన్ స్పిన్నర్లు కట్టడిగా బౌలింగ్ చేసినా.. పాకిస్థాన్ ఏకైక పేసర్గా బరిలోకి దిగిన షాహిన్ అఫ్రిది రెండు ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. బ్యాటింగ్లో బాబర్ ఆజామ్ 5 పరుగులే చేసి వెనుదిరగ్గా.. ఫాదాబ్ ఖాన్ 14 పరుగులకే ఔటయ్యాడు. సీనియర్ల వైఫల్యం పాక్ పతనాన్ని శాసించింది.