
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
ధోనీ అద్భుతమైన కెప్టెనే కాకుండా మంచి మనుసున్న వ్యక్తని కొనియాడాడు. తన కుమారుడు జిబ్రాన్ పెద్దయ్యాక ధోనీతో గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎంతో సంబరపడతాడని, వరల్డ్ బెస్ట్ కెప్టెన్తో ఆడుకున్నానని గర్వంగా చెప్పుకుంటాడని ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాహిర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అయిన తాహీర్.. గత సీజన్లో ధోనీతో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు.
గతేడాది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగిన ఓ మ్యాచ్ అనంతరం మైదానంలోనే ఇమ్రాన్ తాహిర్, షేన్ వాట్సన్ కుమారులతో ధోనీ సరదాగా ఆడుకున్నాడు. పిల్లలిద్దరూ పరుగు పందెం పెట్టుకోగా తాహిర్ కొడుకు జిబ్రాన్ను ధోనీ ఎత్తుకొని పరుగెత్తగా జూనియర్ వాట్సన్వెనుకబడ్డాడు. ఆ సందర్భాన్ని తాహిర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
"నా కుమారుడికి అది చాలా ప్రత్యేకమైన సందర్భం. మహీ భాయ్ గొప్పతనం. అతడు ఎంత మంచి వ్యక్తో.. ఎంత గొప్ప కెప్టెనో అందరికి తెలుసు. అలాగే గొప్ప మనసుకున్న వ్యక్తి. అది నాకు స్ఫూర్తిదాయకం. గిబ్రాన్ పుట్టినరోజున మహీ మెసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లో ఒకడైన ధోనీతో కలిసి ఆడుకున్నానని పెద్దయ్యాక జిబ్రాన్ చాలా సంతోష పడుతాడు. వరల్డ్ బెస్ట్ కెప్టెన్తో ఆడుకున్నానని చెప్పుకుంటాడు. పిల్లలతో ధోనీ చాలా సరదాగా ఉంటాడు. జిబ్రాన్ను అంత మంది ముందు ఎత్తుకొని పరుగెత్తడంతో ఆశ్చర్యపోయా. వ్యక్తిగతంగా నాకు ధోనీ అంటే ఎంతో గౌరవం ఉంది. మా చెన్నై ప్లేయర్లు, మా దేశ ఆటగాళ్లు ఎప్పుడూ ధోనీకి టచ్లో ఉంటాం'అని తాహిర్ తెలిపాడు.
చెన్నై తరఫున ప్రతీ మ్యాచ్ ఆడుతుంటే రోమాలు నిక్కబొడిచేవని, ఓ ప్రత్యేక అనుభూతి కలిగేదని చెప్పుకొచ్చాడు. విజయం కోసం టీమ్గా కష్టపడేవాళ్లమని, ఒకరి సక్సెస్ను మరొకరం ఆస్వాదించేవాళ్లమన్నాడు. సాధ్యమైనన్నీ మ్యాచ్లు గెలవడానికి ప్రయత్నించేవాళ్లమని, ఇవే సీఎస్కేను ప్రత్యేక జట్టుగా నిలబెట్టాయాన్నాడు.