పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం కదిలి వచ్చింది. జైలులో ఉన్న ఆయనకు సరైన వైద్య చికిత్స అందించాలని కోరుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్రికెట్ దిగ్గజాలంతా కలిసి ఓ ఉమ్మడి లేఖను విడుదల చేశారు. ముఖ్యంగా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ చూపు కోల్పోయారనే వార్తలు క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇమ్రాన్ ఖాన్కు సరైన వైద్య చికిత్స అందచేయాలని విజ్ఞప్తి చేసిన దిగ్గజ క్రికెటర్లలో భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఉన్నారు. పాకిస్థాన్తో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. దిగ్గజ క్రికెటర్లు క్రీడా స్ఫూర్తి కనబర్చారు. 1983 ప్రపంచకప్ విజేత కపిల్ దేవ్, లెజెండరీ ఓపెనర్ గవాస్కర్ ఇద్దరూ ఇమ్రాన్ ఖాన్ హక్కులను కాపాడాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఫిబ్రవరి 17న విడుదల చేసిన ఈ అధికారిక లేఖలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ కెప్టెన్లు సంతకాలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ చూపు దెబ్బతింటున్న నేపథ్యంలో.. 'ఆయన కోరుకున్న నిపుణులైన వైద్యులతో తక్షణమే మెరుగైన చికిత్స అందించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గౌరవప్రదమైన నిర్బంధ పరిస్థితులు కల్పించాలి. ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలి.ఎలాంటి అడ్డంకులు లేకుండా పారదర్శకమైన చట్టపరమైన సహాయం పొందే అవకాశం కల్పించాలి.’అని మాజీ క్రికెటర్లు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
మైదానంలో స్టంప్స్ తీసేయగానే తమ పోటీ ముగుస్తుందని, కానీ గౌరవం శాశ్వతంగా నిలుస్తుందని మైఖేల్ అథర్టన్, అలాన్ బోర్డర్, స్టీవ్ వా వంటి దిగ్గజాలు ఈ లేఖలో పేర్కొన్నారు. 1992లో పాకిస్థాన్కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్, క్రికెట్కే కాకుండా దేశ ప్రధానిగా కూడా సేవలందించారని వారు గుర్తు చేశారు.
ఈ చారిత్రాత్మక లేఖపై సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, మైఖేల్ అథర్టన్, అలాన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, నాస్సర్ హుస్సేన్, డేవిడ్ గోవర్, జాన్ వ్రైట్ సహా పలువురు ప్రముఖులు సంతకాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో రాసిన ఈ లేఖ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేయనున్న వైద్య బోర్డు నివేదిక కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.