కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)తో పాటు భారత ఆటగాళ్లకు భారీ నష్టం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు కారణంగా సుమారు రూ.300- 400 కోట్ల వార్షిక ఆదాయాన్ని బీసీసీఐ, భారత ఆటగాళ్లు కోల్పోనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త చట్టం ప్రకారం గేమింగ్ యాప్స్పై నిషేధం పడటంతో ఆ సంస్థల నుంచి అడ్వర్టైజింగ్, ప్రమోషన్ల రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడనుంది. గేమింగ్ యాప్స్ నుంచి గతేడాది బీసీసీఐతో పాటు ఆటగాళ్లకు యాడ్స్, ప్రమోషన్స్ రూపంలోనే సుమారు రూ 300-400 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.
ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లు కారణంగా ఇప్పటికే జెర్సీ స్పాన్సర్గా డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ డీల్ క్యాన్సిల్ కారణంగా బీసీసీఐ సుమారు రూ. 125 కోట్లు వరకూ నష్టపోయే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐపైనే కాకుండా ఆటగాళ్లపై కూడా ఈ బిల్లు ప్రభావం చూపనుందని అడ్వర్టైజింగ్ వర్గాలు తెలిపాయి.

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా డ్రీమ్ 11కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, సౌరవ్ గంగూలీ మై11 సర్కిల్తో ఒప్పందం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ.. ఎంపీఎల్కు ప్రచార కర్తగా వ్యవహరించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. విన్జోతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రచారకర్తలుగా ఆటగాళ్లు గేమింగ్ యాప్స్ నుంచి కోట్ల రూపాయాలు ఆర్జిస్తున్నారు.
అత్యధికంగా విరాట్ కోహ్లీ ఏడాదికి రూ. 12 కోట్లు ఆర్జిస్తుండగా.. రోహిత్, ధోనీ రూ. 7 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ఏడాదికి కోటి దక్కుతుంది. భారత ఆటగాళ్లందరికీ కలిపి రూ. 150 నుంచి 200 కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా. తాజా బిల్లు నేపథ్యంలో ఆటగాళ్లంతా ఈ ఆదాయం కోల్పోనున్నారు.
బీసీసీఐనే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలపైనా ఈ బిల్లు ఎఫెక్ట్ ఉండనుంది. ఐపీఎల్లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు గేమింగ్ యాప్స్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. కొందరు ఆటగాళ్లు తమ ఎండార్స్మెంట్ ఫోర్ట్ ఫోలియోలో తక్కువ పరిమాణంలో కాంట్రాక్ట్లు ఉన్నప్పటికీ.. ఆదాయపరంగా మాత్రం ఎక్కువ ప్రభావం చూపనుంది. సిరాజ్, సుందర్లు మూడు బ్రాండ్స్తో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో మై11 సర్కిల్ ఉంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ పోతే 33 శాతం ఆదాయం కోల్పోనున్నారు.