న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ను చూసి భయపడుతున్నారని ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ అన్నాడు. పాకిస్థాన్ జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని తెలిపాడు. పటిష్టమైన బౌలింగ్ లైనప్తో పాటు స్టార్ బ్యాటర్లు ఉన్నారని చెప్పాడు. అఫ్గానిస్థాన్తో శ్రీలంక వేదికగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
పాక్ పేస్ త్రయం షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారీస్ రౌఫ్లు నిప్పులు చెరగడంతో అఫ్గాన్ 59 పరుగులకే కుప్పకూలింది. ఈ బౌలింగ్ ప్రదర్శన అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఆసియాకప్ 2023తో పాటు వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ బౌలర్లతో ప్రత్యర్థులకు కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఇమామ్ ఉల్ హక్.. తమ జట్టును చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని తెలిపాడు. 'నేను వన్డే ప్రపంచకప్, ఆసియాకప్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్పైనే ఫోకస్ పెట్టాను. వన్డే వరల్డ్ కప్ కోసం మానసికంగా, శారీరకంగా సిద్దం అవుతున్నా.
పాకిస్థాన్ వన్డే టీమ్ను చూసి జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే మేం సాధించిన విజయాలు అలా ఉన్నాయి. మాకు పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉంది. అలాగే వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నారు. వన్డేల్లో మా టీమ్ బెస్ట్గా ఉంది. జట్టు నిండా ఎంతో అనుభవంతో కూడిన ఆటగాళ్లున్నారు. నేను ఇప్పటి వరకు 60 వన్డేలు ఆడాను. ఫకార్ జమాన్ 70 మ్యాచ్లు ఆడితే.. బాబర్ ఆజమ్ 100 దాకా మ్యాచులు ఆడాడు.
నసీం, షాహీన్, హారీస్, వసీం జూనియర్, షాదబ్, నవాజ్, ఒసామా మీర్, ఇఫ్తికర్ అమ్మద్, సల్మాన్ ఆలీ అఘా, రిజ్వాన్.. ఇలా మా టీమ్లో అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారు. నేను జట్టులో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. నేను జట్టులో లేకపోయినా.. ఈ జట్టు బలంగానే ఉందని చెప్పేవాడిని. జట్టులో ప్రతీ ఒక్కరికి వారి బాధ్యతపై అవగాహన ఉంది. సునాయసంగా ప్రపంచకప్ గెలుస్తామనే నమ్మకం ఉంది.'అని ఇమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు.
ఆసియాకప్ 2023 టోర్నీ ఆగస్టు 30న ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో నేపాల్తో పాకిస్థాన్ తలపడనుంది. సెప్టెంబర్ 2న జరిగే మ్యాచ్లో భారత్-పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.