
న్యూఢిల్లీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన ఆట తీరును మార్చుకోవాలని సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ సూచించాడు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ను చూసి బౌలర్లు ఎవరూ భయపడటం లేదని, అతను తన స్ట్రైక్రేట్ను మెరుగుపరుచుకొని బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలని పేర్కొన్నాడు. పాకిస్థాన్కు చెందిన సామా టీవీ చర్చలో పాల్గొన్న ఇమామ్ ఉల్ హక్.. విరాట్ కోహ్లీలా మ్యాచ్లను ఫినిష్ చేసే విధానాన్ని బాబర్ అలవర్చుకోవాలన్నాడు. బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ విరాట్ కోహ్లీ తన దేశం విజయం కోసం మ్యాచ్లను ఎలా ముగిస్తాడో.. అలా బాబర్ ఆడాలన్నాడు.
'బాబర్ ఆజామ్ కాసేపు క్రీజులో ఉండగానే ఎంతోసేపు ఉన్నానని, ఎన్నో పరుగులు చేశానని ఫీలవుతుంటాడు. అతను ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చూపాలంటే తన ఆటను మార్చుకోవాలి. మ్యాచ్లను ఫినిష్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించడం నేర్చుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్లో డేంజరస్ బ్యాటర్లు అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్లు చేసే పని ఇదే. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ వారిని భయపెడతారు.
బాబర్ ఆజామ్ కూడా ఇలా ధాటిగా ఆడటంపై ఫోకస్ పెట్టాలి. 50 పరుగులు చేయగానే రిలాక్స్ అవ్వకుండా జట్టు విజయాన్ని పూర్తి చేయాలి. ఫిఫ్టీ తర్వాత మరింత స్వేచ్ఛగా ఆడుతూ బౌలర్లపై విరుచుకుపడాలి. అప్పుడే బాబర్ అంటే బౌలర్లకు భయం పుడుతోంది. ప్రస్తుతం బాబర్ ఆటను చూసి ఎవరూ భయపడటం లేదు. బౌలర్లు భయపడేలా అతను ఆడటం లేదు. స్ట్రైక్రేట్ పెంచుకుంటే బాబర్తో పాటు పాక్ జట్టుకు మేలు జరుగుతుంది.'అని ఇమామ్ ఉల్ హక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సహచర ఆటగాడికి సూచనలు చేయడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. తాను ఏదో దిగ్గజ క్రికెటర్ అన్నట్లు బాబర్ ఆజామ్కు సలహాలు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు.