భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్తో..వికెట్ల వెనుకాల ఉన్న జెమీ స్మిత్ అతనితో మాట్లాడాడు.
దూకుడుగా ఆడుతున్న రిషభ్ పంత్ను 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి టెస్ట్ల్లో ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అందుకోవాలని సూచించాడు. అందుకు పంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. రికార్డుపై తనకు ఆశ లేదని, తన ఆట తాను ఆడుతానని, రికార్డ్లు వాటంతట అవే వస్తాయని తెలిపాడు.

జెమీ స్మిత్: 'టెస్ట్ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ 55 బంతుల్లో నమోదైంది. ఈ రోజు నువ్వు ఆ రికార్డ్ అందుకోగలవు'.
రిషభ్ పంత్: 'నేను రికార్డుల కోసం ఆడను. నాకు అంత అత్యాశ కూడా లేదు. రికార్డ్స్ వచ్చేది ఉంటే అవే వస్తాయి'.
64/1 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్లతో 161) మరోసారి భారీ శకంతో చెలరేగాడు. కేఎల్ రాహుల్(84 బంతుల్లో 10 ఫోర్లతో 55), రిషభ్ పంత్(58 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతో 65), రవీంద్ర జడేజా(118 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(2/93), షోయబ్ బషీర్(2/119) రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జోరూట్ చెరో వికెట్ పడగొట్టారు. దాంతో ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 587 ఆలౌట్ (శుభ్మన్ గిల్ 269; షోయబ్ బషీర్ 3/167)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 407 ఆలౌట్ (జెమీ స్మిత్ 184 నాటౌట్, సిరాజ్ 6/70)
భారత్ రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్లేర్డ్ (శుభ్మన్ గిల్ 161, జోష్ టంగ్ 2/93)