ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను పోలాండ్ భామ ఇగా స్వియాటెక్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇగా స్వియాటెక్ 6-0, 6-0తో అమెరికాకు చెందిన అమాండా అనిసిమోవాను చిత్తు చేసింది. 57 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. స్వియాటెక్ ఆధిపత్యం చెలాయించడంతో అమెరికా ప్లేయర్ తేలిపోయింది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన ఏడో మ్యాచ్గా నిలిచింది. 114 ఏళ్ల తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ 6-0, 6-0తో ముగియడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1911లో ఈ ఫీట్ నమోదైంది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి స్వియాటెక్ ఆధిపత్యం చెలాయించింది. సర్వీస్, రిటర్న్స్, బేస్ లైన్ ప్లేతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. స్వియాటెక్ ఈ మ్యాచ్లోనే కాకుండా ఈ టోర్నీ మొత్తంలో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. సెమీఫైనల్ నుంచి టోర్నీ ముగిసే వరకు వరుసగా 18 గేమ్స్ గెలిచింది. ఫైనల్లో పవర్ హిట్టింగ్, కచ్చితమైన ప్లేస్మెంట్, టచ్ వాలీలతో అనిసిమోవాను ఇబ్బంది పెట్టింది. సెమీఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ అరెనా సబలెంకాను ఓడించిన అనిసిమోవా.. ఫైనల్లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది. 28 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు స్వియాటెక్ 2 తప్పిదాలు మాత్రమే చేసింది. ఒక్క ఏస్ మాత్రమే సాధించింది.
ఈ విజయంతో స్వియాటెక్ ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. ఇందులో నాలుగు ఫ్రెంచ్ ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ టైటిల్ ఉండగా.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వింబుల్డన్ టైటిల్ కూడా వచ్చి చేరింది. ఓపెన్ ఎరాలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి పొలాండ్ ప్లేయర్గా స్వియాటెక్ చరిత్ర సృష్టించింది. స్వియాటెక్కు ఇది 100వ గ్రాండ్స్లామ్ మ్యాచ్ విజయం.