భారత బౌలర్లపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి పేలవ బౌలింగే కారణమని చెప్పాడు. ఇలా బౌలింగ్ చేస్తే 500 పరుగులు చేసినా సరిపోవని అభిప్రాయపడ్డాడు. బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో టీమిండియా 358 పరుగులు చేసినా విజయాన్నందుకోలేకపోయింది. విపరీతమైన డ్యూ సౌతాఫ్రికాకు కలిసొచ్చింది. డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో టీమిండియా అదనంగా మరో 20-30 పరుగులు చేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే ఈ వాదనను క్రిష్ శ్రీకాంత్ తప్పుబట్టాడు. 358 పరుగుల భారీ స్కోర్ అని, పేలవ బౌలింగ్ టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా రాణించలేకపోతుందని, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ నిలకడగా రాణించలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. తాజా ఫలితంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. తమిళ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని వన్డేల్లో ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు.

'మరో 20 పరుగులు చేయాల్సింది అనడం దురాశే. 358 పరుగులకు మించి ఏం కావాలి. ఇంకా 20 పరుగులు చెయాల్సిందని అంటే.. 500 పరుగులు కూడా సరిపోవు. భారత ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కేఎల్ రాహుల్ చివర్లో గొప్పగా ఆడి విలువైన పరుగులు అందించాడు. 27 బంతులాడిన జడేజా కూడా 30-35 పరుగులు చేసుంటే భారత్ మరో 10 పరుగులు అదనంగా చేసిది. అయితా 358 భారీ స్కోర్. మంచు టీమిండియా అవకాశాలను దెబ్బతీసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ అదనంగా 10 పరుగులు చేస్తే బాగుండేది. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ బాగా ఆడితే గెలిచేది అనుకోవడం సరికాదు. రోహిత్, జైస్వాల్ మెరుగైన ఆరంభం ఇవ్వకపోయినా.. భారత్ భారీ స్కోర్ చేసింది. ఈ సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. కానీ అతని గైర్హాజరిలో భారత్ ఇబ్బంది పడుతుంది. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేస్తున్నా.. నిలకడగా రాణించలేకపోతున్నారు. కొన్నిసార్లు మెరుగైన ప్రదర్శన చేస్తే మరికొన్నిసార్లు విఫలమవుతున్నారు. అర్ష్దీప్ సింగ్ ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో వరుణ్ చక్రవర్తీ సభ్యుడిగా ఉన్నాడు. అతను అక్కడ చాలా బాగా బౌలింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను ఎప్పుడూ వన్డేలు ఆడలేదు. అతన్ని ఎందుకు పక్కనపెట్టారో నాకు అర్థం కావడం లేదు. అతన్ని తుది జట్టులో ఆడించాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ విన్నర్గా అతను సత్తా చాటాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు అతన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా.'అని క్రిష్ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.