
గౌహతి: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. ఆదివారం గౌహతి వేదికగా జరగనున్న రెండో మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే మరో మ్యాచ్తో పనిలేకుండా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇదే జరిగితే కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను అందుకోనున్నాడు. సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా నిలవనున్నాడు. ఇప్పటికే ఓ క్యాలండర్ ఇయర్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత్ సారథిగా రికార్డును అందుకున్న రోహిత్ శర్మ.. ఈ క్రమంలోనే ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.
ధోనీ సారథ్యంలో భారత్ 2016లో 15 టీ20ల్లో విజయం సాధించగా.. రోహిత్ శర్మ 16 మ్యాచ్ల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. సౌతాఫ్రికాతో తొలి టీ20 విజయంతో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టీ20లు, ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ రికార్డు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. గత టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్.. ద్వైపాక్షిక సిరీస్ల్లో విజయాలందుకున్నాడు. కానీ ప్రధాన టోర్నీ ఆసియాకప్లో మాత్రం విఫలమయ్యాడు. ఆసియాకప్ పోతే పోనీ కానీ టీ20 ప్రపంచకప్లో జట్టును విజేతగా నిలబెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రోహిత్ శర్మను ఓ చెత్త రికార్డు కూడా ఊరిస్తోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో సిల్వర్ డక్ అయిన రోహిత్.. రేపటి మ్యాచ్లో కూడా సున్నాకే పెవిలియన్ చేరితే టీ20ల్లో 10సార్లు డకౌట్ అయిన బ్యాటర్గా చెత్త రికార్డును మూటగట్టుకోనున్నాడు. రెండో టీ20 కోసం ఇప్పటికే గౌహతి చేరుకున్న టీమిండియా.. ముమ్మరంగా సాధన చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు వెన్ను నొప్పితో బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. అతని స్థానంలో జట్టులోకి సిరాజ్ రాగా.. అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది.