
నాగ్పూర్: ఆస్ట్రేలియాతో సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన చిట్టి మ్యాచ్లో రోహిత్ సేన చితక్కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో కైవసం చేసుకుంది. దాంతో ఆదివారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్ సిరీస్ డిసైడర్గా మారింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే టీ20ల్లోనే నయా చరిత్రను లిఖించనుంది. ఒక క్యాలండర్ ఈయర్లో అత్యధిక విజయాలందుకున్న తొలి జట్టుగా రోహిత్ సేన రికార్డుకెక్కనుంది.
ఈ క్రమంలో దాయాదీ దేశం పాకిస్థాన్ రికార్డును అధిగమించనుంది. కాన్పూర్ విజయంతో పాకిస్థాన్ రికార్డును రోహిత్ సేన సమం చేసింది. ఈ ఏడాది మొత్తం 28 టీ20 మ్యాచ్లు ఆడిన భారత్.. ఇందులో 20 విజయాలు నమోదు చేసింది. గతేడాది బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ 20 విజయాలు నమోదు చేసి ఈ ఘనతను అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. తాజాగా నాగ్పూర్ విజయంతో భారత్ ఈ రికార్డును సమం చేసింది. రేపు(ఆదివారం) ఉప్పల్లో జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే 21వ విజయం నమోదు చేస్తోంది. పూర్తి బ్యాటింగ్ ట్రాక్ అయిన ఉప్పల్ గ్రౌండ్లో పరుగుల మోత మోగనుంది.
నాగ్పూర్ టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.
అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.