
2014 సీజన్లోనూ..
ఆ సీజన్లో ముంబై ఇలానే వరుసగా ఐదు మ్యాచ్లను ఓడింది.. ఇంకేం పుంజుకొంటుందిలే అనుకుని ప్రత్యర్థి జట్లు కాస్త రిలాక్స్ అయ్యాయి.. ఇదే అదనుగా చెన్నై, కోల్కతా మినహా ఇతర జట్లపై వరుసపెట్టి విజయాలను నమోదు చేసి ప్లేఆఫ్స్ చేరుకుంది రోహిత్ సేన. ఇప్పుడు కూడా మరోసారి ముంబైకి అదే పరిస్థితి ఎదురైంది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

వరుస విజయాలతో..
ఏ జట్టైనా వరుసగా రెండో మూడో మ్యాచ్లను ఓడితేనే డీలాపడతాయి. అలాంటిది ముంబైయి ఏకధాటిగా ఐదు మ్యాచ్ల్లో పరాజయం పాలైనా టాప్4లో స్థానం పదిలం చేసుకొంది. ఎలిమినేటర్ మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టినా సరే ఆ పోరాట పటిమను ఎప్పటికీ మరువలేం. చెన్నై, కోల్కతా జట్లపై మాత్రమే ఓడిన ముంబై రెండో రౌండ్లో మిగతా టీమ్లపై విజయం సాధించడం విశేషం.

ఏడు విజయాలు.. ఏడు పరాజయాలు...
ఆ సీజన్లో ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొనగా.. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే కనీసం ఏడు విజయాలను నమోదు చేయాలి. అప్పటికీ మెరుగైన రన్రేట్ను కలిగి ఉండాలి. అప్పటికే వరుసగా ఐదు మ్యాచ్లను ఓడిన ముంబైకి అవకాశం లభించదని అభిమానులు నిరాశ పడ్డారు. అయితే, వారి అంచనాలను తప్పని రుజువు చేస్తూ తన ఆరో మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు మొత్తం తొమ్మిదింట ఏడు విజయాలు, రెండు అపజయాలతో 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్కు కూడా సరిగ్గా 14 పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్తో ముంబై ప్లేఆఫ్స్కు చేరుకొంది. సరిగ్గా ఇలానే 2022వ ఏడాది సీజన్లోనూ ముంబై రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ సారి కష్టమే..
అయితే అప్పుడు 8 జట్లు మాత్రమే పాల్గొన్నాయి కాబట్టి ఏడు విజయాలతో ముంబై ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ ఈ సారి జట్ల సంఖ్య పది చేరడంతో ప్లే ఆఫ్స్ చేరడం అంత సులువు కాదని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో జట్టు 14 మ్యాచ్లు ఆడుతుండగా ప్లే ఆఫ్స్ చేరాలంటే కనీసం 9 మ్యాచ్లైనా గెలవాలి. లేకుంటే ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. 9 మ్యాచ్లు గెలవడమే కాదు.. మెరుగైన రన్రేట్ కూడా మెయింటేన్ చేయాలి.


Click it and Unblock the Notifications
