సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే ఐస్లాండ్ క్రికెట్.. ఐపీఎల్ 2025 సీజన్ను ఉద్దేశించి ఓ సెటైరికల్ ట్వీట్ చేసింది. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఓ చెత్త జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు 'ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్'అనే పేరు పెట్టింది. ఐస్లాండ్ క్రికెట్ ప్రకటించిన ఈ సూపర్ ఫ్లాప్ టీమ్లో చాలా మంది ఆటగాళ్లు ఇప్పటికే ఆయా జట్ల అభిమానుల చేతుల్లో రోస్ట్ అయినవారే. క్రికెట్ విశ్లేషుకుల ఆగ్రహానికి గురైన ప్లేయర్లే కావడం గమనార్హం.
ఈ ఐపీఎల్ సీజన్లో స్టార్ ఆటగాళ్ల కంటే కుర్రాళ్లే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆటగాళ్ల కంటే తక్కువ ధరకు వచ్చిన అనామక ఆటగాళ్లే తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐస్లాండ్ క్రికెట్ ప్రకటించిన సూపర్ ఫ్లాప్ టీమ్లో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, గ్లేన్ మ్యాక్స్వెల్, లివింగ్ స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతీరణ, మహమ్మద్ షమీ వంటి కోట్లు పలికిన ఆటగాళ్లు ఉన్నారు.

కెప్టెన్గా లక్నో ఫ్రాడ్..
ఈ ఫ్రాడ్ ఎలెవన్కు రిషభ్ పంత్ను కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. రిషభ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ అతను ఒక్క మ్యాచ్లో విన్నింగ్ పెర్ఫామెన్స్ చేయలేదు. 10 మ్యాచ్ల్లో 128 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ ఫ్లాప్ ఎలెవన్కు ఓపెనర్లుగా ఎంపికైన ఆటగాళ్లు ఇద్దరూ చెన్నై సూపర్ కింగ్స్కు చెందినవారే. రచిన్ రవీంద్రకు రూ. 4 కోట్లు, రాహుల్ త్రిపాఠికి రూ. 3.4 కోట్లు పెట్టి చెన్నై తీసుకుంది. కానీ ఈ ఇద్దరూ నట్టేట ముంచేయడంతో చెన్నై లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.
ఇషాన్ కిషన్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్లు పెట్టి తీసుకుంది. కానీ అతను తొలి మ్యాచ్ సెంచరీ మినహా రాణించిందేం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ చేరకుండానే అస్సాం ట్రైన్ ఎక్కేసింది. ఈ జాబితాలో మరో రిచెస్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్. అతన్ని కేకేఆర్ రూ. 23.75 కోట్లు పెట్టి తీసుకుంది. కానీ అతను అంచనాలను అందుకోలేకపోయాడు. రూ. 4.20 కోట్లు పలికిన పంజాబ్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్వెల్ 48 పరుగులే చేసి గాయంతో ఇంటి బాట పట్టాడు.
'ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్'..భలే పేరు!
రూ. 8.78 కోట్లు పలికిన లివింగ్ స్టోన్.. ఆర్సీబీకి భారంగా మారి బెంచ్కు పరిమితమయ్యాడు. రూ. 9.75 కోట్లు దక్కించుకున్న అశ్విన్, రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసిన దీపక్ హుడా చెన్నై కొంపముంచారు. రూ. 13 కోట్లు పలికిన సీఎస్కే ప్లేయర్ మతీష పతీరణ అంతగా ప్రభావం చూపలేకపోయాడు. రూ. 10 కోట్లు దక్కించుకున్న మహమ్మద్ షమీ.. పేలవ ప్రదర్శనతో సన్రైజర్స్ కొంపముంచాడు. రూ. 8 కోట్లకు తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఊసురుమనిపించాడు.
అతన్ని ఈ ఫ్లాప్ టీమ్కు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ఈ చెత్త టీమ్లో ఆరుగురు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ ఐపీఎల్ చెత్త టీమ్కు ఐస్లాండ్ క్రికెట్ 'ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్'అనే పేరు భలే పెట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ ఫ్రాడ్స్ అండ్ స్కామర్స్ టీమ్:
రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కెప్టెన్/కీపర్), వెంకటేశ్ అయ్యర్, గ్లేన్ మ్యాక్స్వెల్, లివింగ్ స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతీరణ, మహమ్మద్ షమీ.
నో ఇంపాక్ట్ ప్లేయర్: ముఖేష్ కుమార్