భారత మహిళల జట్టు తొలి సారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. సొంతగడ్డపై 8 జట్లు బరిలోకి దిగిన టోర్నీలో భారత్ అద్వితీయమైన ప్రదర్శనతో 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఆదివారం నవీముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి సరికొత్త చరిత్రను లిఖించింది.
నెల రోజులకు పైగా సాగిన ఈ టోర్నీ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ టోర్నీకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. మైదానాలన్నీ అభిమానులతో కిక్కిరిసిపోగా.. రికార్డ్ వ్యూయర్షిప్తో బ్రాడ్కాస్టర్స్ పంట పండింది.

ఈ సిరీస్లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ టాప్ స్కోరర్గా నిలిచింది. 9 మ్యాచ్ల్లో 571 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఉంది. ఆమె కూడా 9 మ్యాచ్లు ఆడి 434 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున ఒక ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా స్మృతి రికార్డ్ సాధించింది.
7 మ్యాచ్ల్లో 328 పరుగులతో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆష్లీ గార్డ్నర్ మూడో స్థానంలో నిలిచింది. ఇందులో రెండు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ ఉంది. భారత ఓపెనర్ ప్రతీకా రావల్ 7 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాయంతో 308 పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.
ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ 7 మ్యాచ్లు ఆడి 304 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. జెమీమా(292) ఏడో స్థానంలో నిలవగా.. హర్మన్ ప్రీత్ కౌర్(260) 11వ స్థానంలో నిలిచింది.
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆమె 9 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా ప్లేయర్ సదర్లాండ్ 7 మ్యాచ్ల్లో 17 వికెట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ ప్లేయర్ ఎక్లిస్టోన్ 16 వికెట్లతో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ అలానా కింగ్ 13 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచింది. దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది. బ్యాటింగ్లో 215 పరుగులతో పాటు బౌలింగ్లో 22 వికెట్లు తీయడంతో ఆమెకు ఈ అవార్డ్ లభించింది. ఫైనల్లోనే ఆమె ఐదు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.