మెల్బోర్న్: బౌలింగ్లో దారుణ ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు.. బ్యాటింగ్లో ఇంకా ఘోరంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి భారీ లక్ష్యాన్ని చూసే సగం దడుసుకున్న టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. పరుగులు సమర్పించుకోవడంలో బౌలర్లు పోటీపడితే.. వికెట్లు ఇచ్చుకోవడంలో బ్యాటర్లు తలపడ్డారు.
లీగ్ మ్యాచ్ల్లో చెలరేగిన షెఫాలీ వర్మ.. కీలక సమరంలో మాత్రం చేతులెత్తేసింది. కేవలం మూడు బంతులే ఆడి రెండు పరుగులే చేసి తొలి వికెట్గా వెనుదిరిగింది. దీంతో క్రీజులోకి వచ్చిన తానియా బాటియా.. బంతిని తలకు బలంగా తాకడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. ఆ మరుసటి ఓవర్లలోనే జెమీమా రోడ్రిగ్స్(0) ఔటైంది. తర్వాత వరుస ఫోర్లతో జోరు కనబర్చిన మంధాన.. జొనస్సెన్ బౌలింగ్లో డీప్ స్క్వేర్ దిశగా భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది.
అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్(4) కూడా భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్గా పెవిలియన్ బాట పట్టింది. 30 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో వేదకృష్ణమూర్తి, దీప్తి శర్మ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు.
కానీ డిలిస్సా కిమ్మిన్స్ వేదను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చింది. మిడాఫ్లో జొనస్సెన్ అద్భుత క్యాచ్ అందుకుంది. దీంతో భారత్ 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మరోసారి తమ కలను సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భారత అమ్మాయిలు చేజార్చుకున్నారు. తానియా భాటియా స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా రిచా ఘోష్ బ్యాటింగ్కు దిగింది.