
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న ఫైనల్లో ఆస్ట్రేలియా శుభారంభాన్ని అందుకుంది. ఆ జట్టు ఓపెనర్ అలీసా హిలీ వరుస బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడుతూ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాదిన అలీసాకు ఇండియన్ అమ్మాయిల చెత్త ఫీల్డింగ్తో లైఫ్ లభించింది.
ఫార్వార్డ్లో అలీసా ఇచ్చిన సునాయస క్యాచ్ను యువ సంచలనం షెఫాలీ వర్మ విడిచి పెట్టింది. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్న అలీసా రెండో ఓవర్లో రెండో బంతిని బౌండరీకి తరలించి అంతర్జాతీయ మహిళల టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆసీస్ బ్యాటర్గా రికార్డు సొంతం చేసుకుంది.
అలీసా కన్నా ముందు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (2772) ఆసీస్ తరఫున ఈ ఫీట్ అందుకుంది. ఇక ఓవరాల్గా 11వ బ్యాటర్గా ఈ ఆసీసీ ఓపెనర్ నిలిచింది. ఈ జాబితాలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్(3243) అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ నుంచి మిథాలీ రాజ్(2364), హర్మన్ప్రీత్ కౌర్(2182) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఇక మరో ఓపెనర్ బెత్ మూనీ ఇచ్చిన క్యాచ్ను రాజేశ్వరీ గైక్వాడ్ విడిచిపెట్టింది. దీంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసీస్ ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ఇక పవర్ ప్లే ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది.