సిడ్నీ: ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2020 ఫైనల్లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీస్లో ఆసీస్ డక్వర్త్ లూయిస్ ప్రకారం 5 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ ఫైట్కు అర్హత సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది.
ఆ జట్టు కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (49 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్తో 49 నాటౌట్) అజేయంగా నిలవగా.. బెత్ మూనీ (24 బంతుల్లో 4 ఫోర్లతో 28) పర్వాలేదనిపించింది. ప్రత్యర్థి బౌలర్లలో నదిన్ డి క్లెర్క్ (3/19) మూడు వికెట్లు తీయగా.. ఎమ్లాబ, ఖాక తలో వికెట్ తీశారు.
ఆసీస్ ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో సఫారీ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులుగా నిర్ధేశించారు. ఈ టార్గెట్ ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన సఫారీలు.. 13 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు. లురా వాల్వర్డట్ (41 నాటౌట్) ఒంటి పోరాటం చేసిన ఫలితం లేకపోయింది. కెప్టెన్ డివాన్ నికెర్క్ (12), ఓపెనర్ లిజెల్లే లీ(10) విఫలమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో మెగన్ స్కట్ రెండు వికెట్లు తీయగా..జొనాస్సెన్, మొలినక్స్, కిమ్మిన్స్ తలో వికెట్ తీశారు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన తొలి సెమీస్ వర్షంతో రద్దవ్వడంతో గ్రూప్-ఎ టాపర్గా హర్మన్ ప్రీత్ సేన నేరుగా ఫైనల్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.