
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ రద్దయిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి నిర్మూలన కోసం దేశాలన్నీ లాక్డౌన్ పాటిస్తున్నాయి. దీంతో క్రీడాకారులంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ.. సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. అభిమానులతో చిట్ చేస్తున్నారు.
అయితే ఇలా సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే క్రమంలో ఫిక్సర్లతో జాగ్రత్తగా ఉండాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) హెచ్చరిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ ఈవెంట్లు ఏమీ లేవని ఏ విషయాన్ని లైట్గా తీసుకోవద్దని ముందుగానే క్రికెటర్లను హెచ్చరించింది.
ఫిక్సర్లకు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ఈవెంట్లు, వాటి ఫలితాలే కాకుండా, లాంగ్ షెడ్యూల్ మ్యాచ్లపై కూడా అవగాహన ఉంటుందని, ఆ మ్యాచ్లను ఫిక్సింగ్ చేయడానికి ఈ లాక్డౌన్ వినియోగించే అవకాశాలు లేకపోలేదంటూ పేర్కొంది. ఈ మేరకు ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ చీఫ్ అలెక్స్ మార్షల్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'కరోనా వైరస్తో క్రీడా ఈవెంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లాక్డౌన్ కారణంగా అటు అంతర్జాతీయ మ్యాచ్లు, ఇటు దేశవాళీ మ్యాచ్లు వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని ఫిక్సర్లు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.
ఇటువంటి సందర్భాల్లో వారు చాలా యాక్టివ్గా ఉంటారు. ఫిక్సింగ్లో బాగా పేరుగాంచిన కొంతమంది ప్రస్తుత సమయాన్ని వినియోగించుకుంటారు. మన క్రికెటర్లు ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో వారితో టచ్లోకి వస్తారు.. మాటా-మంతీ కలిపి వల వేస్తారు. మీతో పరిచయాల్ని పెంచుకోవడానికి యత్నిస్తారు. ఆపై ఫిక్సింగ్కు చేయడానికి ప్రేరేపిస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని అన్ని క్రికెట్ బోర్డులకు చెరవేసి అప్రమత్తంగా ఉండాలని కోరాం' అని అలెక్స్ మార్షల్ తెలిపారు.