ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రైజ్మనీ బాగా పెరిగింది. ఈ టోర్నీ ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ రూ. 121 కోట్లుగా పేర్కొంది. ఇది పురుషుల వన్డే వరల్డ్ కప్ 2023 ప్రైజ్మనీ కంటే కూడా చాలా ఎక్కువ. ఎంత అంటే మహిళల ప్రపంచకప్ ప్రైజ్మనీ ఏకంగా 297 శాతం పెరిగింది.
విజేతగా నిలిచిన జట్టుకు రూ. 39.55 కోట్లు, రన్నరప్కు రూ. 19.77 కోట్లు, సెమీఫైనలిస్ట్లకు రూ. 9.88 కోట్ల నగదుపురస్కారం లభించనుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్మనీ కంటే కూడా ఇది చాలా ఎక్కువ. ఈ టోర్నీలో ఛాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియాకు రూ. 33.32 కోట్లు, రన్నరప్ భారత్కు 16.66 కోట్ల ప్రైజ్మనీ మాత్రమే లభించింది. సెమీఫైనల్స్ టీమ్స్కు రూ.6.66 కోట్లు ప్రైజ్మనీగా అందాయి.

మహిళల వన్డే ప్రపంచకప్ ప్రైజ్మనీ బాగా పెరగడం వెనుక ఐసీసీ ఛైర్మెన్ జై షా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు, పురుషులు అనే వ్యత్యాసం ఐసీసీకి లేదనే విషయాన్ని జై షా ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా మహిళల క్రికెట్కు మరింత ఆదరణ పెరగాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 కంటే ముందే పురుషులు, మహిళలకు సమాన వేతనాలు, ప్రైజ్మనీని అందజేయాలని ఐసీసీ నిర్ణయించింది. కానీ ఇంత భారీ స్థాయిలో ప్రైజ్మనీ పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇది జై షా క్రెడిట్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
2022లో మహిళల వన్డే ప్రపంచకప్ చివరిసారిగా జరగ్గా.. ఐసీసీ ప్రైజ్మనీ కింద 31 కోట్లే కేటాయించింది. ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు రూ.12 కోట్లు, రన్నరప్ ఇంగ్లండ్కు రూ. 5 కోట్లు మాత్రమే దక్కాయి. కానీ అప్కమింగ్ వన్డే ప్రపంచకప్ ప్రైజ్మనీని ఐసీసీ ఏకంగా 4 రెట్లు పెంచింది. విజేత జట్టుకే దాదాపు రూ. 40 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా జరిగే తొలి మ్యాచ్లో శ్రీలంకతో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.