న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో బీభత్సమైన రికార్డు నమోదైంది. ఊహకు కూడా అందని భారీ స్కోర్ నమోదు చేసిన ఓ జట్టు.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందుకుంది. ఈ సంచలన రికార్డును అగ్రరాజ్యం అమెరికా అండర్ 19 జట్టు తన పేరిట లిఖించుకుంది. ఐసీసీ అండర్-19 పరుషుల క్వాలిఫయర్ టోర్నీలో ఈ సంచలన రికార్డు అందుకుంది.
అర్జెంటీనా అండర్-19 టీమ్తో గత సోమవారం జరిగిన మ్యాచ్లో 515 పరుగుల భారీ స్కోర్ చేసిన యూఎస్ఏ అండర్ 19 టీమ్.. 450 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. క్రికెట్ చరిత్రలోనే ఇదే భారీ స్కోర్తో పాటు భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ అండర్19 టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 515 పరుగులు చేసింది.

భవ్యమెహతా(136), రిషి రమేశ్(100) సెంచరీలతో చెలరేగగా.. ప్రణవ్ చట్టిపలాయమ్(61), అర్జున్ మహేశ్(67) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం అర్జెటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అమెరికా బౌలర్ ఆరిన్ నాదకర్ణి(6/21) అర్జెంటీనా పతనాన్ని శాసించాడు.
భారీ విజయాన్ని సాధించిన యూఎస్ఏ అండర్ 19 టీమ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అండర్ 19 క్రికెట్ చరిత్రలో భారీ స్కోర్, భారీ విజయం నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. 2022లో ఆస్ట్రేలియా అండర్ 19 టీమ్ కెన్యా జట్టుపై 480 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్ కాగా.. తాజాగా అమెరికా జట్టు అధిగమించింది.

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా అమెరికా చరిత్రకెక్కింది. లిస్ట్-ఏ క్రికెట్లో తమినాళు జట్టు అరుణాచల్ ప్రదేశ్పై 506 పరుగులు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే భారీ స్కోర్గా ఉంది. 450 పరుగుల భారీ తేడాతో గెలిచిన అమెరికా భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. 2002లో కెన్యాతో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పూర్తిగా బ్యాటర్ల గేమ్గా మారిందనడానికి ఈ మ్యాచే నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. ఇది క్రికెట్కు ఏ మాత్రం మంచిది కాదని, బ్యాట్, బంతి మధ్య సమపోరాటం ఉండాలని సూచిస్తున్నారు.