
బెంగళూరు: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డే నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటనపై ఐసీసీ స్పందించింది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని 'నేను బుమ్రాలా బౌలింగ్ చేయగలను'(I can bowl like Bumrah)అంటూ రాసి ఉన్న ఓ ఫ్లకార్డ్ ప్రదర్శించాడు. దీనిని గమనించిన ఐసీసీ.. ఆ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ 'మేము వీడియో ప్రూఫ్ కావాలనుకుంటున్నాం'(We'd like to see video proof ) అంటూ క్యాప్షన్గా పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
విభిన్నశైలి కలిగిన బుమ్రా బౌలింగ్ అంటే అందరూ ఇష్టపడుతారు. గతంలో కూడా బుమ్రా బౌలింగ్ను అనుకరించే వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. యార్కర్ల కింగ్గా.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన బుమ్రా అనతికాలంలోనే వరల్డ్ క్లాస్ పేసర్గా ఎదిగాడు. గాయంతో సౌతాఫ్రికా, వెస్టిండీస్ సిరీస్లకు దూరమైనా.. శ్రీలంక టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. మునపటిలా వికెట్లు సాధించనప్పటికీ పరుగులను మాత్రం నియంత్రిస్తుండు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మొదటి స్పెల్లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా.. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఒక బంతి వైడ్ రూపంలో బౌండరీ వెళ్లడంతో ఐదు పరుగులు వచ్చాయి. ఈ ఒక్క బంతి మినహాయించి బుమ్రా అదరగొట్టాడు.