అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. రెండేళ్ల తర్వాత టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా 2022 మార్చిలో టాప్-10లో నిలిచిన కోహ్లీ.. తాజా ర్యాంకుల్లో 9వ స్థానానికి చేరుకున్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 38 రన్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 76 పరుగులు చేయడంతో కోహ్లీ నాలుగు స్థానాలు ఎగబాకాడు. టాప్-10లో ఉన్న ఏకైక భారత బ్యాటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. తొలి టెస్ట్లో దారుణంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ 10 నుంచి 14వ ర్యాంక్కు పడిపోయాడు. రోడ్డు ప్రమాదంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న రిషభ్ పంత్ 15వ స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికాపై సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ 11 స్థానాలు ఎగబాకి 51వ ర్యాంక్లో నిలిచాడు.

టెస్ట్ బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్(872 పాయింట్స్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్పై తొలి టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడా రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్లో అదరగొడుతున్న ప్యాట్ కమిన్స్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతున్నారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ ఫలితం అనంతరం ఈ ర్యాంకుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు పడ్డాయి. 95 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 23.2 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ సిరాజ్(6/15) ఆరు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా... జస్ప్రీత్ బుమ్రా(2/25), ముఖేష్ కుమార్(2/0) రెండేసి వికెట్లతో రాణించారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 153 పరుగులకు కుప్పకూలింది. ఓ దశలో 153/4 స్కోర్తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది.