దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి ఒకే ఒక్క ప్లేయర్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తమ ర్యాంకులు కోల్పోయారు.
భారత్ తరఫున 758 రేటింగ్ పాయింట్స్తో రిషభ్ పంత్ మాత్రమే పదో స్థానంతో టాప్-10లో ఉన్నాడు. రోహిత్ శర్మ 12వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 13వ ర్యాంక్కు పడిపోయారు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన ఆసీస్ స్టార్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ టాప్-3లో చోటు దక్కించుకున్నారు. మార్నస్ లబుషేన్ తన నెంబర్ వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు.

భారత్ తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చిన అజింక్యా రహానే ఏకంగా 37 స్థానాలు ఏగబాకాడు. అలాగే హాఫ్ సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్ ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 94వ ర్యాంక్ను దక్కించుకున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడకపోయినప్పటికీ బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ (860 పాయింట్లు) తన తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జేమ్స్ అండర్సన్ (850), పాట్ కమిన్స్ (829) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో కీలకమైన నాలుగు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ నాథన్ లైయన్ (777 పాయింట్లు) ఒక ర్యాంక్ను మెరుగుపర్చుకుని ఓలీ రాబిన్సన్తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు.
ఇక ఈ విభాగంలో బుమ్రా (772) రెండు స్థానాలను కోల్పోయి 8వ స్థానంలోకి పడిపోయాడు. రవీంద్ర జడేజా (765) యథావిధిగా 9వ స్థానంలోనే ఉన్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (862 పాయింట్లు) ఒక ర్యాంక్ దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. అయితే గత 20 ఇన్నింగ్స్ల్లో అత్యధిక యావరేజ్ సాధించిన బ్యాటర్గా బాబర్ ఆజామ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్లను అతను అధిగమించాడు. గత 20 ఇన్నింగ్స్ల్లో బాబర్ 69.10 సగటుతో పరుగులు సాధించాడు.
ఇందులో నాలుగు సెంచరీలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక స్టీవ్ స్మిత్ గత 30 ఇన్నింగ్స్ల్లో 55.40 సగటుతో పరుగులు రాబట్టాడు.