
దుబాయ్: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దుమ్మురేపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో తమ బౌలింగ్తో ఆసీస్ పతనాన్ని శాసించిన ఈ స్పిన్ ద్వయం.. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానాలను అందుకుంది. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని రెండో ర్యాంకు సాధించగా.. జడేజా 6 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 763 రేటింగ్ పాయింట్స్తో 9వ స్థానంలో నిలిచాడు.
నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం నేపథ్యంలో రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో సత్తా చాటిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ టాప్ ర్యాంక్ దక్కించుకున్నాడు. 866 రేటింగ్ పాయింట్లతో కమిన్స్ను వెనక్కునెట్టాడు. దాంతో నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న అతిపెద్ద క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 1466 రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగిన కమిన్స్ భారత్ దెబ్బకు టాప్ ర్యాంక్ను చేజార్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్ట్ల్లో అశ్విన్ చెలరేగితే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడు.
బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ ఏడో స్థానం దక్కించుకోగా.. రిషభ్ పంత్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. స్మిత్, బాబర్ ఆజామ్, ట్రావిస్ హెడ్, జోరూట్ టాప్-5లో ఉన్నారు. ఆల్రౌండర్ల జాబితాలో భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్-2 ర్యాంకులను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకొని ఐదో స్థానంలో నిలిచాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్ట్ మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా జరగనుంది.