
దుబాయ్: ఆస్ట్రేలియాతో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో దుమ్మురేపారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విభాగంలో 8 స్థానాలు ఎగబాకాడు. రోడ్డుప్రమాదానికి గురైన రిషభ్ పంత్ 9వ స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పదో స్థానంతో నిలిచాడు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్లో విరాట్ కోహ్లీ 186 పరుగులు చేయడంతో 705 రేటింగ్ పాయింట్స్తో 8 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ (800) నాలుగు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఆఖరి టెస్ట్లో హాఫ్ సెంచరీతోరాణించిన ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (915) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్.. అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ (859)తో కలిసి సంయుక్తంగా నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన అశ్విన్.. ఆఖరి టెస్ట్లో 6 వికెట్లు తీసి పది పాయింట్లను తన ఖాతాలో వేసుకొని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
గాయంతో జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (780) ఏడో స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా (753) 9వ స్థానంలో నిలిచాడు.
ఆల్రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో రవీంద్ర జడేజా(431), రవిచంద్రన్ అశ్విన్(359)లు నిలిచారు. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (316) కూడా రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
జట్లపరంగా ఐసీసీ టాప్ ర్యాంకింగ్స్లో పెద్దగా మార్పులు జరగలేదు. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (122)కు టీమిండియా(119) సమీపంగా వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (106), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్ (100), పాకిస్థాన్ (88), శ్రీలంక (88), వెస్టిండీస్ (76), బంగ్లాదేశ్ (46), అఫ్గానిస్థాన్ (40) టాప్ -10లో కొనసాగుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ను టీమిండియా ఓడిస్తే అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటుంది.