
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదుల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. ర్యాంకు మెరుగుపరుచుకోకపోయినా.. సుదీర్ఘ ఫార్మాట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో హిట్ మ్యాన్ కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్స్ అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో ముగిసిన రెండో టెస్ట్లో హాఫ్ సెంచరీతో రాణించడం రోహిత్ శర్మకు కలిసొచ్చింది. వరుసగా రెండు టెస్ట్ల్లో విఫలమైనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రోహిత్ కంటే విరాట్ కేవలం మూడు రేటింగ్ పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు. రోహిత్ జోరు కొనసాగి.. కోహ్లీ మళ్లీ విఫలమైతే.. భారత కెప్టెన్ను హిట్ మ్యాన్ అధిగమిస్తాడు.
ఇక రెండో టెస్ట్లో సూపర్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు. కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో ఉండగా.. మార్నస్ లబుషేన్(878) జోరూట్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ, రిషభ్ పంత్, బాబర్ ఆజామ్, డేవిడ్ వార్నర్, క్వింటన్ డికాక్ టాప్-10లో వరుసగా కొనసాగుతున్నారు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్(848) సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అశ్విన్.. ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జస్ప్రీత్ బుమ్రా ఒక్క ర్యాంక్ దిగజారి టాప్10లో ఉన్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. జాసన్ హోల్డర్ టాప్లో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ సిరాజ్ సైతం కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. 465 రేటింగ్ పాయింట్స్తో 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇషాంత్ శర్మ 18 పాయింట్లు సాధించగా.. బుమ్రా 6 పాయింట్లు కోల్పోయాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ స్థానంలో నిలిచాడు. గాయంతో సిరీస్కు దూరమైన స్టువర్ట్ బ్రాడ్ 8వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్తో భారత జట్టులో హయ్యెస్ట్ ర్యాంకు ఉన్న ఓపెనర్(రోహిత్ శర్మ), వికెట్ కీపర్(రిషభ్ పంత్), స్పిన్నర్(అశ్విన్) ఉన్నారు.
ఇటీవల ముగిసిన లార్డ్స్ టెస్ట్లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(129), రోహిత్ శర్మ(83) రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్.. జోరూట్(180) అజేయ సెంచరీతో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగులు ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా 9వ వికెట్కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో భారత్ 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది.