అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్, తెలంగాణ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్లో 23 వికెట్లతో సత్తా చాటిన మియా భాయ్.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్ అందుకున్నాడు. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఆఖరి పోరులో మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్తో టీమిండియాను గెలిపించాడు.
374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్నైట్ స్కోర్తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులే అవసరమవ్వగా.. సిరాజ్ సంచలన ప్రదర్శనతో జెమీ స్మిత్, జెమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్లను పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే సిరాజ్.. మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు.

ఆఖరి టెస్ట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల విభాగంలో టాప్-10లో భారత్ నుంచి జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఉన్నాడు. జడేజా మూడు స్థానాలు దిగజారి 17వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్కు చెందిన గస్ అట్కిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. క్రిస్ వోక్స్ ఒక స్థానం దిగజారి 24వ స్థానంలో కొనసాగుతున్నాడు.
పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఓవల్ టెస్ట్లో యశస్వి జైస్వాల్ సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. మరోవైపు గాయంతో ఆఖరి టెస్ట్కు దూరమైన రిషభ్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఆఖరి టెస్ట్లో విఫలమైన శుభ్మన్ గిల్ 4 స్థానాలు దిగజారి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.