
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండు స్థానాలు ఎగబాకాడు. ఐసీసీ బుధవారం ప్రకటించిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో విలిమయ్సన్ 886 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. ఇక 911 పాయింట్లతో ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఇటీవల వెస్టిండీస్తో ముగిసిన ఫస్ట్ టెస్ట్లో కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సూపర్ డబుల్ ఇన్నింగ్స్తో 74 పాయింట్ల అందుకున్న కేన్ మామా.. 886 పాయింట్లతో టాప్-2లో నిలిచాడు. కేన్కు అండగా 86 పరుగులతో రాణించిన టామ్ లాథమ్ కూడా కెరీర్ బెస్ట్ 733 పాయింట్లు అందుకొని 10వ స్థానాన్ని అందుకున్నాడు.
ఇక వెస్టిండీస్ జట్టులో జెర్మైన్ బ్లాక్వుడ్ 17 స్థానాలు ఎగబాకి 41 వస్థానంలో నిలిచాడు. 2017లో 40వ ర్యాంకు అందుకున్న బ్లాక్ వుడ్ ఆ తర్వాత ఇదే బెస్ట్ ర్యాంకు. ఇక బౌలర్ల జాబితాలో టీమ్ సౌథీ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ కెప్టెన్ హోల్డర్ ఐదో ర్యాంకు నుంచి ఏడుకు పడిపోయాడు. ఆల్రౌండర్ల జాబితాలో కూడా అగ్రస్థానాన్ని కోల్పోయాడు.
ఇక భారత్ నుంచి బ్యాటింగ్ జాబితాలో కోహ్లీ(2), చతేశ్వర్ పుజారా(7) ఇద్దరే టాప్-10లో ఉన్నారు. బౌలర్ల లిస్ట్లో బుమ్రా ఒక్కడే తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో జడేజా(3) ఒక్కడే టాప్-10లో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్స్లో ఆసీస్ అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, భారత్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.