
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్- ఫాకిస్థాన్ మధ్య టీ20 సిరీస్ ముగియడంతో ఐసీసీ బుధవారం తాజా ర్యాంకులు ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో 697 పాయింట్లతో కోహ్లీ ఏడో స్థానంలో నిలిచాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 816 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్ సంచలన హిట్టర్ డేవిడ్ మలాన్ 915 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు టీ20 సిరీస్లో కోహ్లీ 134 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గ్లేన్ మ్యాక్స్వెల్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని 6వ స్థానంలో నిలవగా.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ తన నాలుగో స్థానాన్ని నెలబెట్టుకున్నాడు. కోహ్లీ, రాహుల్ మినహా మరో భారత బ్యాట్స్మెన్ టాప్-10లో లేడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 736 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. టాప్-10 కనీసం ఒక్క భారత బౌలర్ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.
స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 614 పాయింట్లతో 12వ స్థానంలో నిలవగా.. జస్ప్రీత్ బుమ్రా 593 పాయింట్లతో 19వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లోనూ టాప్-10లో భారత క్రికెటర్లకి ఎవరికీ చోటు దక్కలేదు. భారత్ జట్టు వచ్చే ఏడాది మార్చి వరకూ టీ20 మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఇంగ్లండ్తో మార్చి 12 నుంచి 20 వరకూ మొత్తం ఐదు టీ20లను టీమిండియా ఆడనుంది.