
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఇక శ్రీలంక పర్యటనలో దుమ్మురేపిన స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్, దీపక్ చాహర్ మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోగా.. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా కెరీర్ బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు.
720 రేటింగ్ పాయింట్స్తో ఏకంగా టాప్-2లో నిలిచాడు. అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ను వెనక్కి నెట్టాడు. రషీద్ ఖాన్ 719 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రియజ్ షంసీ 792 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు.
ఇక వాషింగ్టన్ సుందర్ను వెనక్కు నెట్టిన భువనేశ్వర్ కుమార్ 16వ స్థానం దక్కించుకున్నాడు. సుందర్కన్నా 3 పాయింట్లు ఎక్కువగా సంపాందించి మొత్తం 588 పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టీ20లో ఉత్తమ ప్రదర్శన కనబరచడం భువీకి కలిసొచ్చింది. తొలి టీ20లో భువీ నాలుగు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. చాహల్ 21 స్థానం దక్కించుకోగా, దీపక్ 34వ స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్ బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. బాబర్ ఆజామ్, ఆరోన్ ఫించ్, డెవాన్ కాన్వే వరుసగా రెండు మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ, రాహుల్.. గత కొన్నాళ్లుగా టీ20 సిరీస్లు ఆడిందిలేదు. రోహిత్ శర్మ ఓ స్థానం దిగజారి 14వ స్థానంలో నిలిచాడు. బౌలర్లు, ఆల్రౌండర్స్ జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం.