
దుబాయ్: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని అందుకోలేకపోయాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్లో సూర్య 805 పాయింట్లతో తన రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 818 పాయింట్లతో తన టాప్ ర్యాంక్ను కాపాడుకున్నాడు.
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఓపెనర్గా సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడని అంతా ఊహించారు. కానీ.. వెస్టిండీస్తో ఆఖరి టీ20లో అతనికి టీమిండియా మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. దాంతో.. 805 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలోనే నిలవాల్సి వచ్చింది. మహమ్మద్ రిజ్వాన్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిమలన్ వరుసగా 3, 4, 5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
వెస్టిండీస్తో ఇటీవల ముగిసిన ఐదు టీ20ల సిరీస్లో నిలకడగా రాణించిన శ్రేయాస్ అయ్యర్.. ఆరు స్థానాలు పైకి ఎగబాకి 19వ స్థానంలో నిలిచాడు.
ఆఖరి టీ20లో అయ్యర్.. 40 బంతుల్లోనే 64 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో మొత్తంగా 115 పరుగులు సాధించిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. 66వ స్థానం నుంచి 59వ ర్యాంకుకు చేరుకున్నాడు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 528 పాయింట్లతో 32వ స్థానానికి పడిపోగా.. కేఎల్ రాహుల్ 555 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచాడు. ఇక భారత కెప్టెన్ రోహిత్ శర్మ 599 పాయింట్లతో 16వ స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ దుమ్మురేపాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన అతడు ఏకంగా టాప్-50లోకి చేరుకున్నాడు. 481 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 44వ ర్యాంకు సాధించాడు. ఇక ఈ సిరీస్లో రెండో మ్యాచ్లో అద్బుతంగా(6 వికెట్లు) రాణించినప్పటికీ.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 28వ స్థానం నుంచి 35వ స్థానానికి పడిపోయాడు.
ఇక టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ విషయానికొస్తే.. ఒక స్థానం దిగజారి 28వ ర్యాంకుకు పడిపోయాడు. మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తొమ్మిదో ర్యాంకుకు దిగజారాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.