
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లకు పెద్దగా చోటే దక్కలేదు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి ఇద్దరే ఉండగా.. బౌలింగ్, ఆల్రౌండర్ల జాబితాలో ఒక్కడు కూడా లేడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఎనిమిదో స్థానం నిలబెట్టుకోగా.. కేఎల్ రాహుల్ ఓ ర్యాంక్ చేజారి ఆరో ప్లేస్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2021 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక పాత్ర పోషించిన విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి 33వ స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ 839 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి దుమ్మురేపాడు. ఇంగ్లండ్కు చెందిన డేవిడ్ మలాన్ 805 పాయింట్లతో రెండో స్థానంలో.. ఎయిడెన్ మార్క్రమ్ 796 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డెవన్ కాన్వే 747 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. టి20 ప్రపంచకప్లో సూపర్ ప్రదర్శన కనబరిచిన పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 742 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్ విభాగంలో టాప్-10లో భారత క్రికెటర్లు ఎవరూ చోటు దక్కించుకోలేదు. అయితే ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. టి20 ప్రపంచకప్లో హ్యాట్రిక్తో మెరిసిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ 797 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ 784 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆల్రౌండ్ విభాగంలో మహ్మద్ నబీ 265 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. షకీబ్ అల్ హసన్ (260 పాయింట్లు), లియామ్ లివింగ్స్టోన్(179 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.