
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ 717 రేటింగ్ పాయింట్స్తో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 699 రేటింగ్ పాయింట్స్తో కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో ఉన్నాడు. మరే భారత బ్యాట్స్మన్ టాప్-10లో చోటు దక్కించుకోలేదు. విధ్వంసకర బ్యాట్స్మన్ రోహిత్ శర్మ 21 వ స్థానంలో ఉన్నాడు. ఇటీవల భారత జట్టు ఎక్కువగా టెస్ట్ సిరీస్లు ఆడటంతో మెరుగైన ర్యాంకులు అందుకోలేకపోయారు.
ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ 841 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ 819 పాయింట్లతో రెండు, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ 733 పాయింట్లతో మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్మన్ డేవాన్ కాన్వే 700 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ల్లో దుమ్మురేపుతున్న సౌతాఫ్రికా వికెట్కీపర్-బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ ఒకేసారి నాలుగు స్థానాలు ఎగబాకి.. 671 పాయింట్లతో 8వ స్థానానికి చేరుకున్నాడు.
మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్లో సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ శంసీ 775 పాయింట్లతో తొలి ర్యాంక్లో ఉండగా తర్వాతి స్థానాల్లో శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా 747, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 719 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్(689), ముజీబ్ ఉర్ రెహ్మాన్(687), అష్టన్ అగర్(649), ఆడమ్ జంపా(648), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (626), షకీబ్ అల్ హసన్(611), టీమ్ సౌథీ(605) టాప్-10లో వరుసగా కొనసాగుతున్నారు.
ఈ జాబితాలో టీమిండియా బౌలర్లు ఒక్కరూ కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మాత్రం 12, 18 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. ఇక చివరగా ఆల్రౌండర్ల జాబితాలో కూడా ఏ ఒక్క భారత ఆటగాళ్లు టాప్-10లో లేడు. హార్దిక్ పాండ్యా మాత్రం టాప్-20లో చోటు దక్కించుకున్నాడు. 285 రేటింగ్ పాయింట్స్తో మహమ్మద్ నబీ అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్(275), రిచర్డ్ బెర్రింగ్టన్(194), ఖావర్ అలీ(159), రోహన్ ముస్తాఫా(152), గ్లేన్ మ్యాక్స్వెల్(151), ర్యాన్ బర్ల్(142), మిచెల్ మార్ష్(141), జీషన్ మక్సూద్(135), మహముదుల్లా(130) టాప్-10లో కొనసాగుతున్నారు.