మూడో స్థానంలో పాకిస్థాన్..
రన్నరప్ పాకిస్థాన్ 258 పాయింట్స్తో మూడో స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ టాప్-10లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో ఉన్న టీమిండియా 61 మ్యాచ్లు ఆడగా.. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ 48 మ్యాచ్లు మాత్రమే ఆడింది.
తొలి జట్టుగా ఇంగ్లండ్..
ఉత్కంఠగా సాగిన ఫైనల్లో బెన్ స్టోక్స్ అసాధారణ ప్రదర్శనతో విజయాన్నందుకున్న ఇంగ్లండ్.. సంపూర్ణ పరిమిత ఓవర్ల క్రికెట్ విశ్వవిజేతగా నిలిచింది.
2019లో వన్డే ట్రోఫీని గెలుచుకున్న ఆ జట్టు.. ఏకకాలంలో రెండు ఫార్మాట్లలో ట్రోఫీ కలిగి ఉన్న తొలి జట్టుగా ఘనత సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్ జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్ను చేజిక్కించుకుంది. 1992 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోలాగే ఆ జట్టును ఓడించి కప్పును గెలుచుకోవాలనుకున్న పాకిస్థాన్ కల చెదిరింది.
ఐసీసీ బెస్ట్ ఎలెవన్..
పురుషుల టీ20 ప్రపంచకప్ 2022లో అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన టీమ్ను ఐసీసీ తాజాగా ప్రకటించింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తాజా టోర్నీలో 98.66 సగటుతో 296 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ ఈ జాబితాలో ముందు వరసలో నిలిచాడు.
పాక్పై అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (82*) ఒంటిచేత్తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్పై 64, నెదర్లాండ్స్ మీద 62, ఇంగ్లాండ్తో 50 పరుగులు చేసి టీ20 ప్రపంచకప్లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు.
ఈ టోర్నీలో 239 పరుగులతో అదరగొట్టిన సూర్యకుమార్ కూడా చోటు దక్కించుకున్నాడు. నెదర్లాండ్స్తో 51, దక్షిణాఫ్రికాతో 68, జింబాబ్వేతో 61 పరుగులు చేసి మూడు అర్థ సెంచరీలను తన ఖాతాలో వేసుకున్న ఈ ఆటగాడు అద్భుతమైన స్ట్రైక్రేట్(189.68)ను ప్రదర్శించాడు. హార్దిక్ పాండ్యా 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.