అంతర్జాతీయ క్రికెట్లో మంగళవారం నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్లో ఓవర్ రేట్ను తగ్గించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 'స్టాపింగ్ క్లాక్' పేరిట కొత్త రూల్ రూపొందించింది. ఈ రూల్ను ప్రయోగాత్మకంగా పురుషుల వైట్బాల్ ఫార్మాట్లో రేపటి(డిసెంబర్ 12) నుంచి అమలు చేయనుంది.
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో ఈ రూల్ ఆచరణలోకి రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుందని ఐసీసీ ఇటీవల వెల్లడించింది.

అసలు ఈ రూల్ ఏంటంటే..?:ఈ రూల్ ప్రకారం.. బౌలింగ్ టీమ్ మూడు సార్లు 60 సెకన్ల తర్వాత ఓవర్ ప్రారంభించడంలో విఫలమైతే 5 పరుగులు పెనాల్టీ విధించనున్నారు. స్టాప్ క్లాక్ సాయంతో ఓవర్ల మధ్య ఆలస్యాన్ని గుర్తించనున్నారు. ఈ రూల్ అమలై 5 పరుగుల పెనాల్టీ విధిస్తే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 21న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ రూల్పై నిర్ణయం తీసుకున్నారు. ఈ రూల్పై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రూల్ కారణంగా క్రికెట్లో ఉన్న అసలు మజా మిస్సవుతుందని, ఫలితాలన్నీ తారుమారయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం.. బౌలర్లు కూడా ఒళ్లు దగ్గరపెట్టుకొని బౌలింగ్ చేస్తారని, కెప్టెన్లు కూడా సమయాన్ని వృథా చేయరంటున్నారు.
బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత క్రికెట్లో ఈ కొత్త రూల్ బౌలర్లకు ప్రతికూలంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. 60 సెకన్లలోనే బౌలింగ్ చేయాలంటే.. ఫీల్డ్ సెటప్ చేసుకోవడం కుదురదని కామెంట్ చేస్తున్నారు.