ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ రెండు రోజుల్లో ముగియడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పూర్తిగా బౌలింగ్కు అనుకూలించిన ఈ వికెట్పై రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది. ఏకపక్షంగా పేస్ బౌలర్లకు అనుకూలించిన ఈ పిచ్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఒక్క డీమెరిట్ పాయింట్ కేటాయించడంతో పాటు అసంత్పప్తికరంగా ఉందనే రేటింగ్ ఇచ్చింది.
'మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉంది. తొలి రోజు 20 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఒక్క బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఈ పిచ్ అసంతృప్తికరం అనే రేటింగ్ ఇస్తున్నాం. ఈ మైదానానికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించాం.'అని మ్యాచ్ రిషరీ జెఫ్ క్రోవ్ తెలిపారు.

ఐసీసీ పిచ్ రేటింగ్లో వెరీ గుడ్, సంతృప్తికరం, అసంతృకరం, అన్ఫిట్ అనే నాలుగు కేటగిరీలు ఉంటాయి. పిచ్ నాణ్యత సరిగ్గా లేకుంటే ఐసీసీ డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తుంది. అసంతృప్తికరం అనే రేటింగ్కు ఒక డీ మెరిట్ పాయింట్, అన్ఫిట్కు 3 డీమెరిట్ పాయింట్స్ కేటాయిస్తారు. ఈ పాయింట్స్ ఐదేళ్ల పాటు మైదానం ఖాతాలో ఉంటాయి. ఒక వేదికకు 5 డీమెరిట్ పాయింట్లు వస్తే, ఆ స్టేడియాన్ని ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు.
రేటింగ్ ఇవ్వడానికి బౌన్స్, సీమ్ మూవ్మెంట్, టర్న్, అవుట్ఫీల్డ్ ఎలా ఉందనే విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఆటగాళ్ల భద్రతకు ప్రమాదకరంగా ఉందా? లేదా? అనేది పరిశీలిస్తారు. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన గత మూడు బాక్సింగ్ డే టెస్ట్లకు వెరీ గుడ్ రేటింగ్ లభించింది.
యాషెస్ సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 3-1తో కైవసం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఆసీస్ గెలుపొందగా.. నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మెల్బోర్న్ పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చేసిన 46 పరుగులే ఈ మ్యాచ్లో అత్యధిక స్కోర్. సిరీస్లో చివరి మ్యాచ్ జనవరి 4 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది.