
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీసుకొచ్చిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) తుది దశకు చేరుకుంది. గత రెండేళ్లుగా సుదీర్ఘంగా సాగిన ఈ మెగా టోర్నీ టైటిల్ పోరుకు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టెస్ట్ క్రికెట్లో తొలిసారి చాంపియన్షిప్ జరగనుండటంతో ఫైనల్ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ టైటిల్ పోరు నేపథ్యంలో తాజాగా ఐసీసీ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది.
ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతుందన్న బెంగలో ఉన్న భారత అభిమానులకు ఆశలు రేకిత్తించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. 2008 అండర్ 19 ప్రపంచకప్లో టీమిండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్లో తలపడ్డాయి. అప్పటి భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. కివీస్ టీమ్లో కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ ఉన్నారు. ఈ నలుగురు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉండటం సహా అప్పుడు, ఇప్పుడు సారథులుగా విరాట్, విలియమ్సనే కావడం విశేషం. అలా 13ఏళ్ల కిందట ఓ మెగా సెమీ ఫైనల్కు ఆడిన ఈ నలుగురు మరోసారి టెస్ట్ చాంపియన్షిప్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఐసీసీ దీనికి సంబంధించిన ఫొటోనే ట్వీట్ చేయగా.. వైరల్గా మారింది.
2008 అండర్-19 ప్రపంచకప్లో ఇరు జట్లు మధ్య జరిగిన ఈ సెమీఫైనల్లో భారత జట్టు.. కివీస్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా టైటిల్ కూడా గెలిచింది. అయితే ఆ మ్యాచ్ ఫలితం మళ్లీ రిపీట్ అయితే భారతే చాంపియన్ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలా జరగాలని కోరుకుంటున్నారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ కోసం ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించింది. అయితే మరోవైపు న్యూజిలాండ్.. ఇంగ్లండ్తో రెండు టెస్ట్ల సిరీస్ ఆడుతూ మెగా పోరుకు సిద్దమవుతుంది. ఇక ప్రాక్టీస్ లేమి కోహ్లీసేనను దెబ్బతీస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రాక్టీస్కు తగిన సమయం లేకపోవడం పెద్ద సమస్యేమి కాదని మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.