అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో రోహిత్ శర్మ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలమైన వేళ.. రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. మూడు మ్యాచ్ల్లో 52.33 సగటుతో 157 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ ప్రదర్శనతో వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను వెనక్కినెట్టాడు. 824 పాయింట్స్తో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 765 రేటింగ్ పాయింట్స్తో రెండో స్థానంలో నిలిచాడు. శుభ్మన్ గిల్(763), విరాట్ కోహ్లీ(746) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల సిరీస్ మాత్రమే ఆడనుంది. కాబట్టి రోహిత్ శర్మ అగ్రస్థానం చేరే అవకాశం లేదు. శ్రీలంక పర్యటనలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. కోహ్లీ ర్యాంక్లో మార్పు లేకున్నా.. శుభ్మన్ గిల్ ఓ స్థానం దిగజారాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్లో కుల్దీప్ యాదవ్.. నాలుగో స్థానంలో నిలవగా.. కేశవ్ మహరాజా, జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా టాప్-3లో కొనసాగుతున్నారు. శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్నా.. జస్ప్రీత్ బుమ్రా 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహమ్మద్ సిరాజ్ ఐదు స్థానాలు దిగజారి 10వ స్థానానికి పడిపోయాడు.
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి మ్యాచ్ను టై చేసుకున్న భారత్.. తర్వాతి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. దాంతో 27 ఏళ్ల తర్వాత శ్రీలంక 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.