దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) డిసెంబర్ నెలకు సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్స్ను ప్రకటించింది. ఈ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ నిలిచారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్తగా ఈ అవార్డును ప్రవేశపెట్టిన ఐసీసీ.. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను అంద జేస్తుంది. అందులో భాగంగానే డిసెంబర్ నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ దూరంగా ఉండటంతో.. భారత జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. న్యూజిలాండ్తో సెంచరీ చేసిన మయాంక్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండు మ్యాచ్ల్లోనే 69 సగటుతో 276 పరుగులు చేశాడు. భారత్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో భాగంగా కివీస్ యువ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఓ ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టిన మూడో క్రికెటర్గా నిలిచాడు. ఆ మ్యాచ్లో ఆజాజ్.. 16.07 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు.
కాగా, మిచెల్ స్టార్క్.. యాషెస్ సిరీస్లో భాగంగా అటు బంతితో ఇటు బ్యాట్తో రాణిస్తున్నాడు. ఇంగ్లండ్పై ఆసీస్ టెస్టు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు.
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది.
ఇది ప్రతీ నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.