న్యూఢిల్లీ: అంతా ఊహించినట్లుగానే భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఆయా జట్ల రిక్వెస్ట్తో పాటు సెక్యూరిటీ ఇబ్బందుల నేపథ్యంలో కొన్ని మ్యాచ్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రీషెడ్యూల్ చేసింది. ఈ వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించకున్నా.. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్స్ రిషెడ్యూల్ తేదీలను పేర్కొన్నాయి.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను ఒక్క రోజు ముందుకు జరిపారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగానే నిర్వహించనున్నారు. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో జనాలు వస్తారని, ఆ సమయంలో భారత్-పాక్ మ్యాచ్కు సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు బీసీసీఐకి తెలియజేశారు. దాంతో బోర్డు ఈ మ్యాచ్ను రీషెడ్యూల్ చేసింది. మూడు రోజుల క్రితం ఆయా క్రికెట్ అసోసియేషన్స్తో సమావేశం నిర్వహించిన బీసీసీఐ సెక్రటరీ జై షా రీషెడ్యూల్పై సంకేతాలు ఇచ్చారు.
మూడు దేశాలు తమ మ్యాచ్ల తేదీలను మార్చాలని కోరారని పేర్కొన్నారు. 'షెడ్యూల్ మార్పు కోసం ముగ్గురు సభ్యులు ఐసీసీకి లేఖ రాశారు. తేదీ, సమయాలు మాత్రమే మారతాయి, వేదికలు మారవు. ప్రస్తుతం ఆటల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంటే, మేం దానిని 4-5 రోజులకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం.
మూడు-నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత వస్తుంది. ఐసీసీతో సంప్రదింపులు జరిపి మార్పులు జరుగుతాయి'అని జై షా పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్తో పాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న పాకిస్థాన్-నెదర్లాండ్, పాకిస్థాన్ శ్రీలంక మ్యాచ్ల తేదీల్లోనూ స్వల్ప మార్పులు జరిగాయి.
కొత్త షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 6న, పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 10న జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. బుధవారం రీషెడ్యూల్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.