దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెటర్లు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-2 ర్యాంకుల్లో కొనసాగుతుండగా.. బౌలర్ల జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్-ఐర్లాండ్ వన్డే సిరీస్ ముగియడంతో ఐసీసీ బుధవారం ర్యాంకులను విడుదల చేసింది.
ఈ ర్యాంకింగ్స్లో బ్యాట్స్మెన్ విభాగంలో టాప్లో ఉన్న విరాట్ కోహ్లీ ఖాతాలో 871 రేటింగ్ పాయింట్లున్నాయి. రోహిత్ 855 పాయింట్లతో అతని తర్వాత ఉండగా.. పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్(829) మూడో స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ పేసర్ ట్రెండ్ బౌల్ట్(722) టాప్ ర్యాంక్లో ఉండగా.. బుమ్రా(719), అఫ్గానిస్థాన్ యువ ఆటగాడు ముజిబుర్ రెహ్మాన్(701) రెండు, మూడు ర్యాంకులు సాధించారు. ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా(8వ) ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
ఇక మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో సెంచరీలతో చెలరేగి ఐర్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (113) నాలుగు స్థానాలు ఎగబాకి 42వ ర్యాంకు అందుకోగా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (142) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని 26 ర్యాంకులో నిలిచాడు. ఈ మూడు వన్డేల సిరీస్లో 6 వికెట్లతో చెలరేగిన ఐర్లాండ్ బౌలర్ క్రైగ్ యంగ్ ఏకంగా 40 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 89వ ర్యాంకు దక్కించుకున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ జోషువా లిటిల్ 38 స్థానాలు మెరుగుపరుచుకొని 146వ స్థానంలో నిలిచాడు.
ఆఖరి వన్డేలో సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 22వ ర్యాంకు అందుకోగా.. జానీ బెయిర్స్టో కూడా ఒక స్థానం ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో 5 వికెట్లు తీసిన ఆదిల్ రషీద్ 29 నుంచి 25వ స్థానానికి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్న లెఫ్టార్మ్ పేసర్ డేవిడ్ విల్లే 51వ స్థానాన్ని దక్కించుకున్నారు. 2-1 సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్లో 20 పాయింట్లతో టాప్లో నిలిచింది. ఒక మ్యాచ్ గెలిచిన ఐర్లాండ్ ఖాతాలో 10 పాయింట్లు చేరాయి.
క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కడు.. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడుకున్నా ప్రపంచకప్ విజేతగా నిలిచాడు!