దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ములేపాడు. ఇంగ్లండ్తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన చేజింగ్ కింగ్.. ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. బుధవారం ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ లిస్ట్లో 870 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. మరోవైపు స్టార్ పేస్ జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి నాలుగో స్థానంలో నిలిచాడు. వివాహం వల్ల ఇంగ్లండ్ సిరీస్కు దూరమైన బుమ్రా ఖాతాలో 690 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఇక హిట్మ్యాన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. వరుసగా అర్ధశతకం, శతకం బాదేసిన కేఎల్ రాహుల్ 31 నుంచి 27వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ జాబితాలో 42వ ర్యాంకు దక్కించుకున్నాడు. అతడు 35, 64 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ టాప్-100లో అడుగుపెట్టాడు.
నాలుగేళ్ల తర్వాత పేసర్ భువనేశ్వర్ కుమార్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. తొమ్మిది స్థానాలు మెరుగై 11వ స్థానంలో నిలిచాడు. 2017 సెప్టెంబర్లో అతను పదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఇదే అత్యుత్తమ ర్యాంకు. ఇంగ్లండ్తో ఆఖరి వన్డేలో భువీ 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ 93 నుంచి 80వ ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్ జాబితాలో బెన్స్టోక్స్ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకు సాధించాడు. సెంచరీ వీరుడు జానీ బెయిర్స్టో తిరిగి తన ఏడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు.
ఇక టీ20ల్లో రాహుల్ కోహ్లీ ఒక్కో స్థానం దిగజారి 5, 6 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన మొదటి టీ20లో 52 బంతుల్లోనే 92 పరుగులతో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాడు డెవొన్ కాన్వే 5 స్థానాలు ఎగబాకి 784 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ 892 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకోగా.. ఆరోన్ ఫించ్(830 పాయింట్లు), బాబర్ అజమ్( 801 పాయింట్లు) రెండు.. మూడు స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్ 10లో చోటు సంపాదించలేకపోయారు.