
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. గురువారం విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ 870 పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. రోహిత్ శర్మ.. 842 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 1-2తో సిరీస్ కోల్పోయినా.. విరాట్ కోహ్లీ(63, 89) రెండు హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఇక తొడ కండరాల గాయంతో ఈ సిరీస్కు దూరమైనా రోహిత్ తన ర్యాంకు కాపాడుకున్నాడు.
ఈ ఇద్దరి తర్వాత బాబర్ ఆజామ్(837), రాస్ టేలర్(818)లు ఉండగా.. భారత్తో సిరీస్లో అదరగొట్టిన ఆరోన్ ఫించ్ రెండు స్థానాలు ఎగబాకి టాప్-5లో నిలిచాడు. ఇక తొలి రెండు వన్డేలు ఆడిన డేవిడ్ వార్నర్ ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకొని ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు సాధించి జోరు కనబర్చిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చాలారోజుల తర్వాత టాప్ 20లోకి అడుగుపెట్టగా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా టాప్ 20లో చోటు సంపాదించాడు.
ఇక ఆసీస్ టూర్లో బ్యాటింగ్లో ఇరగదీసిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్లో కెరీర్ బెస్ట్ చేరుకున్నాడు. బౌలర్ల విభాగంలో ఓ స్థానాన్ని కోల్పోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. ఇక భారత్ నుంచి మరో బౌలర్ టాప్-10లో లేడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ బౌలర్ ముజీబుర్ రెహమాన్ 701 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్కు చెందిన హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
ఇక వన్డే సిరీస్ ఓటమి అనంతరం మూడు టీ20ల సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న భారత్.. డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్ట్ల సిరీస్ కోసం సిద్దమవుతుంది. రేపటి నుంచి ఆస్ట్రేలియా ఏ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.