
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ల్లో సత్తా చాటిన ఈ హైదరాబాద్ పేసర్.. ట్రెంట్ బౌల్ట్, హేజిల్వుడ్ లాంటి స్థార్ బౌలర్లను వెనక్కినెట్టి నెంబర్ వన్గా నిలిచాడు. 729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ 727 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్.. నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ర్యాంకింగ్స్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు. న్యూజిలాండ్పై తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన గిల్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ల్లో విఫలమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా.. సెంచరీ బాదిన రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ నంబర్ వన్గా కొనసాగుతున్నాడు.
కివీస్ వన్డే సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా వన్డే ర్యాంకింగ్స్లో ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ని వెనక్కినెట్టి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. టీ20ల్లోనూ భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ని 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా నంబర్ వన్గా నిలిచే అవకాశం ఉంది.