ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అవార్డుల ప్రదానోత్సవానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఎవరూ హాజరుకాకపోవడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. పీసీబీ తీరును ఆ జట్టు మాజీ క్రికెటర్లు కూడా తప్పుబట్టారు. ఆతిథ్య దేశంగా అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనరా? అని షోయబ్ అక్తర్ వంటి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు.
భారత్ విజేతగా నిలవడంతోనే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి పీసీబీ అధికారులు హాజరవ్వలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం.. ఐసీసీ తమ అధికారులను అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అవమానించిందని ఆరోపిస్తోంది. పీసీబీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీని మినహా ఎవర్నీ ఆహ్వానించలేదని, పీసీబీ సీఈఓ దుబాయ్ మైదానంలో ఉన్నా.. అతన్ని వేదికపై పిలవకుండా అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఐసీసీ ముందు తమ నిరసనను తెలియజేస్తామని, లిఖిత పూర్వకమైన వివరణ కోరుతామని కూడా పీసీబీ అధికారి ఒకరు మీడియాతో అన్నారు.

అయితే ఈ వాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు పీసీబీ ఆఫిస్ బేరర్స్ ఎవరూ హాజరు కాలేదని స్పష్టం చేసింది. క్రికెట్ బోర్డుల సీఈఓలను ఐసీసీ ఎప్పుడూ ఆహ్వానించదని పేర్కొంది. ఫైనల్ మ్యాచ్కు హాజరైన ఐసీసీ సీఈఓ జియోఫ్ అల్లార్డైస్ను కూడా స్టేజీ మీదకు ఆహ్వానించలేదని తెలిపింది.
'ఐసీసీ ఎప్పుడూ క్రికెట్ బోర్డు అధికారికంగా ఎంపిక చేసిన వారిని మాత్రమే వేడుకల వేదికపైకి ఆహ్వానిస్తోంది. అక్కడ పనిచేసే కార్యాలయ సిబ్బందిని ఎప్పుడూ ఆహ్వానించదు. దుబాయ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు హాజరైన ఐసీసీ సీఈఓ జియోఫ్ అల్లార్డైస్ను కూడా స్టేజీపైకి ఆహ్వానించలేదు.'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఐసీసీ అధికారి తెలిపాడు. ఈ ఘటనపై పాకిస్థాన్కు తాము ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వమని స్పష్టం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ హాజరవ్వకుండా చేసిన తప్పిదానికి ఐసీసీ ఎందుకు వివరణ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్లో పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహించారు. భారత్ మ్యాచ్లు తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా జరిగాయి. పాకిస్థాన్ జట్టు వరుస పరాజయాలతో లీగ్ దశలోనే ఒక్క విజయం నమోదు చేయకుండా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ మాత్రం ఓటమెరుగని జట్టుగా టైటిల్ కైవసం చేసుకుంది.