టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి హిట్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 9 టీ20 ప్రపంచకప్లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప రాయబారి ఎవరూ లేరని జై షా కొనియాడారు. రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్నారు.
'భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ టీమ్ సారథి కావడంతో పాటు గత 9 టీ20 ప్రపంచకప్లు ఆడిన రోహిత్ శర్మ కంటే గొప్ప బ్రాండ్ అంబాసిడర్ మరొకరు లేరు.'అని జై షా ట్వీట్ చేశారు.

మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. కోహ్లీ, సచిన్కు కూడా ఈ గౌరవం దక్కలేదు. సచిన్ టెండూల్కర్ 2011, 2015, 2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశాడు. కానీ టీ20 ప్రపంచకప్కు రాయబారిగా నియమితం కాలేదు.
ఈ అప్కమింగ్ టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్ విడుదల కార్యక్రమంలో రోహిత్ శర్మతో పాటు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్లు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ ఆ జట్టు నాకౌట్ చేరితే ఆ మ్యాచ్లు కూడా అక్కడే జరుగుతాయి.
ఈ టోర్నీకి ఇటలీ తొలిసారి అర్హత సాధించగా మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. భారత్, పాకిస్థాన్తో పాటు నమీబియా, యూఎస్ఏ, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. దాయాదుల పోరు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా యూఎస్ఏతో జరిగే మ్యాచ్తో భారత్ తమ క్యాంపైన్ను ప్రారంభించనుంది.